మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

28, జూన్ 2011, మంగళవారం

మళ్ళీ సుందర వనాలకు ...!


సెలవులు నాకో పాపాయికో ..అర్థం కాదు .ఏమయినా సెలవలు అయిపోయాయ్. మళ్లీ ఈ బెంగాల్ దేశపు సుందర వనాలలోకి వచ్చి పడ్డాం .




మేం వస్తుంటే మాకు పంపించేందుకు టిఫిన్ సర్దిస్తూ పాపాయి వాళ్ళ నాన్న మీనాక్షి కి ఇది పెట్టండి అది పెట్టండి అని చెప్తున్నాట్ట ,పాపాయి పేరు వినగానే మా రాజ మల్లిక లేచి హడావిడిగా వచ్చి ఏంటి పాపాయి వస్తుందా అని అడిగిందట .మళ్ళీ నాన ఇంకో రూం లోకి వెళ్తే అక్కడికి వచ్చి నిజమేనా పాపాయి వస్తుందా అని అడిగిందట .మద్యాన్నం నాన వెహికల్ దిగగానే వేహికలంతా చెక్ చేసిందట .మేం రాగానే కాంచన కాళ్ళెత్తి మీద పెట్టి పలకరిస్తుంటే రాజాలుకి కూడా చాలా ఉత్సాహం వచ్చేసింది .కాంచన లాగా పైకి లెయ్యాలని కానీ పాపం అది అరవై కేజీల పైనే భరువు ఉంటుంది కదా ఎగరలేక పోయింది .


మా హేమ తల్లికి మేం అటెళ్ళి ఇటోచ్చే లోపే బుజ్జి బుజ్జి కొమ్ములోచ్చాయి .కొమ్ములోచ్చాయా బుజ్జిలూ అంటే ..ఆ వచ్చాయిలే ,,, ఇంతకీ నువ్వెవరూ అని గట్టిగా కోప పడింది .

18, జూన్ 2011, శనివారం

మా ఊరి ఆడోళ్ళ లోక జ్ఞానం !


ఈ రోజు మా సుబ్బమ్మ వచ్చింది, నన్ను చూసి పోవడానికి .
బుజ్జమ్మా నువ్వుండే ఊరి పేరేన్దే..ఎన్ని సార్లు చెప్పినా గవనమే ఉండదూ.......
బెంగాల్ సుబ్బమ్మ, పశ్చిమ బెంగాల్ .
ఆ అదేలే దగ్గిర దగ్గిర అమిరిక కాడ అంతే కదా?
ఆ ..అంతే !అంతే !
*****
నేను హైదరాబాద్ లో చదువుకునేప్పుడు నా దగ్గరికి మా రవణమ్మ వొచ్చింది .
హై కోర్టు భవనాన్ని చూసి ,అందరూ తాజ్ మహల్ ,తాజ్ మహల్ అనుకుంటా ఉంటే ఏందో అనుకున్నా గానీ బలే ఉంది బుజ్జమ్మా .ఇదే గదా తాజ్ మహల ...?
ఆ ..ఇదే !ఇదే !
*****
మా తెల్ల నవ్వుల నల్ల ఎంకటేసిరమ్మ,ఎండ పడి నిగ నిగ మెరస్తా ఉంటే ......
ఎంకటేసిరా.... నీ వొయిసెంత ఇప్పుడూ అన్నా....
ఉండదా ఇరవయ్యారో ..ఇరవై ఏడో..
కాన్పుకొచ్చిన నీ కూతురి వొయిసెంతా ?
పంతొమ్మిది కదా ..గండారపోళ్ళ పట్టన్న కూతురితోపాటిది .......
అయితే నీకు ఎనిమిదేళ్ళకే కూతురు పుట్టేసిందా ?
నువ్వుండు బుజ్జమ్మా ...!ఎనిమిదేళ్ళకి పిలకాయలెట్ట పుడతారూ ...నేనప్పటికి సంసారానికి గూడా రాలా ..!
ఔనౌను... పుట్టరు! పుట్టరు !

17, జూన్ 2011, శుక్రవారం

మా నాన్న చెప్పిన దెయ్యం కథ !


ఇవాళ మధ్యాన్నం నేను ,మా నాన్న ,పాపాయి బోలెడు ముచ్చట్లు చెప్పుకున్నాం . కబుర్ల లోదే దెయ్యం కథ .మా నాన్న వాళ్ళ చిన్న తాత బోలెడు బలశాలంట .ఒక సారి ఏమయ్యిందీ...పొద్దున్నే లేసి ఆయన పక్కూరికి వెళ్ళాట్ట .తిరుగు ప్రయాణమప్పటికి బాగా చీకటి పడి పోయిందట .దారికి రెండు వైపులా అడవి .చిమ్మ చీకటి .

అప్పుడేమయ్యిందీ దగ్గరలోనే ఎక్కడనుండో గొర్రె పిల్ల ఏడుపు వినిపించింది . రాత్రప్పుడు గొర్రె పిల్ల అరుపు వినపడుతుందేమిటీ అనుకున్నాట్ట ఆయన .మళ్ళీ సరేలే ఎవరిదో తప్పి పోయి ఉంటుంది అనుకుని వెతికి భుజాన వేసుకున్నాట్ట .కొంత దూరం నడిచాడో లేదో ఇంత చిన్న గొర్రె పిల్ల ఏనుగంత భరువుగా అనిపించేయడం మొదలు పెట్టిందంట .తాతకి అర్థమై పోయిందట ,ఏమనీ.... ఇది గొర్రె పిల్ల కాదూ దెయ్యం అని .

అప్పుడేం చేశారూ భుజలకి అటేపు యిటేపూ ఉన్న గొర్రె పిల్ల కాళ్ళు పట్టేసుకుని గట్టిగా ధమేల్ మని నేలకేసి కొట్టాట్ట .అబ్బ ఎన్ని వినలేదు యిటువంటి దెయ్యాల కథలూ అనుకుంటున్నారా ... నేనూ అలానే అనుకున్నాను .కానీ కిందపడ్డ దెయ్యం బలే డైలాగ్ చెప్పి విసుక్కుని వెళ్లి పోయింది .అది విని నేను పాపాయి ఆహ్హ్హహ్హ ఒహ్హోహ్హో అని చాలా సేపు నవ్వేసుకున్నాం కిందపడ్డ దెయ్యం ఏమన్నదంటే ''గాజులు పగిలి పోయినాయి కదరా నా బట్టా ''అని



27, మే 2011, శుక్రవారం

జీవితమే సఫలమూ.....!


Get this widget | Track details | eSnips Social DNA


అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెఱగనైతి
చెప్పుడుమాటలకే నే జేరనైతిగా

కొసరికొసరి నీపై కోపమున నుంటిగాని
అసమిచ్చి నీతో మాటలాడనైతిగా
పసలేని సిగ్గుతోడి పంతాననే వుంటిగాని
ముసిముసి నవ్వు మోవి మోపనైతిగా

విరహపు కాకల నావిసుపే చూపితిగాని
సరిబిల్చితే నూకొన జాలనైతిగా
వరుసవంతులకై నే వాదులాడితి గాని
మురిపేన మొక్కితే నే మొక్కనైతిగా

వేగమే నీవు గూడితే వెస భ్రమసితిగాని
చేగలనీమేను పచ్చిసేయనైతిగా
భోగపు శ్రీవేంకటేశ పోట్లదొరతిలోన
నీగతి చెన్నుడవైతే నెనసితిగా

రెండు వారాల క్రితం స్నేహితురాలు ఫోన్ చేసింది T T D వారి అన్నమాచార్య సంకీర్తనల సమ్మర్ కాంప్ జరుగుతుంది.రాకూడదా... మీరు ఇక్కడ ఉన్న నెలలో పాపాయికి నాలుగు పాటలన్నా వస్తాయి కదా అని .పొద్దుటే వెళ్లి ఒక గంట పాటు పాడుకుని వస్తుంటే ఎంత సంతోషంగా ఉందో.జీవితంలో ఆనందం తప్పించి మరేమీ లేని కాంతివంతమైన అనుబూతి .

వదులుగా అల్లుకున్నజడలో బొండు మల్లెలు తురుముకుని వచ్చే డాన్స్ టీచర్ ,చిన్ని కూతురికి తోడుగా వచ్చే అందమైన అమ్మ , కారణం ఏదయితేనేం బోలెడు కాలం తరువాత రోజూ ఒకరినొకరం చూసుకోగలుగుతున్న నేను నా స్నేహితురాలు ,ఇంటికొచ్చి'' జగడపు చనవుల జాజర''.. అనో ''అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ '' అనో పాడేసుకుంటూ ఉంటే,,, దిగులూ వ్యసనమూ ఉండదమ్మ నీకు అని మురిసే మా నాన..

జీవితం ఎంత బాగుంది ....జీవితం ఎంత బాగుంది .హాయిగా తీయగా ఆలపించు పాటలా ,అనారు పూల తోటలా ...ప్రశాంత సాంధ్య వేళలా...జీవితం ఎంత బాగుందో ...ఈ ఎండల వేళల మా ఊరి వీధులను పసుపు వర్ణ భరితం చేసే తీయటి ఉలవ పాటి మామిడి పళ్ళలా ...జీవితం తీయ గా అనిపిస్తుంది.

''నీ వలన తప్పే లేదు మరి నీరు కొలది తామెరవు ;ఆవల బాగీరదీ దరి ఆ జలములే ఊరినయట్లు'' ...''ఎంత మాత్రము ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు ''అట. ఎంత అద్భుతమైన భావన ,''అంతరాంతరములెంచీ చూడ పిండంతే నిప్పటి యన్నట్లు ..''ఎంత సరళమైన పదాలు ఎంత గాఢమైన తాత్వికతకదా .

వేంకటేశ్వరుని పైన కదా అని భక్తి భావం కాదు సంగీతానికి ఆ శక్తి ఏదో ఉంటుంది .ఆండాళ్ తిరుప్పావై వినండి అలాటిదే మరోదేదైనా వినండి .భక్తి కాదు. భాష తెలియకున్నా ఉదాత్త భావాలేవో మనలో ప్రవేసిస్తాయ్ .ప్చ్ అద్భతమైన వాటికి మనం మతాల కులాల రంగులు పులిమేస్తాం కదా ...

ఒక్కో వ్యక్తికి ఒక్కో మోహం ఉంటుంది కాబోలు నాకు అట్లా సంగీతం ఓ పిచ్చి .కానీ సంగీతానికే నా పై దయ లేదు . పాడుకుంటూ ఉంటే స్నేహితురాలు ముని పంటితో నవ్వుని అదిమేసి ఎంత ముద్దుగా పాడుతావో నీ పాటల్లో ఫీలింగ్ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు...అని అంటుంది సరదాగా .

మనం కోరుకున్నది పొందలేక పోయినంత మాత్రాన దానిపై ఇష్టం పోదు కదా ! పోక పోగా ప్రేతంలా పట్టుకుని మనల్ని మరింత పీడిస్తుంది .దిగులు పెట్టేస్తుంది .యేడి పించేస్తుంది .ఎప్పుడో కంటమో, ఏ రాగమో, ఏ సాహిత్యమో ఎందుకో ఒక పాటై మన జీవితంలో ప్రవేసించేస్తుంది . ఇక అంతే ఇదీ అని వివరించలేని ఆరాటం .ఏం చెయ్యాలో తోచదు .ఘన సమయం అంతా ఆ ఒక్క పాట చుట్టే గిరికీలు కొడుతూ ఉంటుంది.

పాడుకుంటూ ఉంటే పాపాయో ,వాళ్ళ నానో మధ్యలో మాట్లాడిస్తారు .నేనింత తాదాత్మ్యం తో పాడుకుంటూ ఉంటే మాట్లాడిస్తారా ఎంత రస హీనులు అని గునుస్తే.. నీకు ఇరవై నాలుగు గంటలూ తాదాత్మ్యమే ...మరింక మేమెప్పుడు మాట్లాడాలి అని నసుగుతారు .కానీ ఎందుకిట్లా ఊపిరాడ నీయకుండా చేస్తుంది ఒక చిన్ని పాట అని దిగులు ...నాజీవితంపై ఇంత అదుపు ఏమిటి అని బెంగ !

ఇక్కడిచ్చిన పాట ఇంతకు మునుపు ఎప్పుడూ వినలేదు .పాడినావిడ ఎవరో తెలియదు ,పోసేసివ్ నెస్ తో కోపించి కలహించిన నాయిక పశ్చాత్తాపాన్ని హృదయంతరాలలో ని ఆర్తిని , ఎంత బాగా పలికించిందో ...

24, మే 2011, మంగళవారం

మమత బెనర్జీ ప్రతిజ్ఞ !


బెంగాల్ ప్రజలు చాలా సున్నిత మనస్కులు .సంస్కారులు.త్వరగా స్పందిస్తారు.వారి ఈ స్పందించే స్వభావమే చరిత్ర పొడుగూత, మిగిలిన భారతీయులం , మనం వారిని స్మరించుకునేలా చేసింది .బెంగాల్ లో ఉంటూ ఆ ప్రజల ఆకాంక్షలను దగ్గరగా చూడగల అవకాశం ఉన్న వ్యక్తిగా ,నేను ఇవాళ ఊహించగలను. ఈ మార్పు తీసుక రావడం పై వారెంత యోచించారో ,కిందా పైన అయ్యారో ,దిగులు చెందారో .ఎంతగా రోసి పోయారో .బహుశా సమీప భవిష్యత్ లో వారి దుష్ట తరమైన కలల్లోకి కూడా బెంగాలులు CPM ని అనుమతించ లేరేమో .

నిజమే ...తల పగల కొట్టుకోడానికి ఏ రాయయినా ఒకటే అని మేథావులు చెప్తే చెప్పారుగాక ...తల పగల కొట్టుకునే రాయిని ఎంపిక చేసుకునే కనీస అవకాశం కలిగి ఉండటం కూడా గొప్ప విషయమే కదా. ఆ రాయి స్త్రీ కావడం ఆశా భరితమైన మార్పులకు నాంది కావొచ్చేమో కదా !

పాపాయి వాళ్ళ నాన్నచాలా సంతోష పడ్తూ ,మురిసి పోతూ బెంగాల్ పత్రికలలో పడ్డ ఒక వార్తా కధనాన్ని నాకు వినిపించాడు .సంభదిత ఫోటోలు మెయిల్ చేసాడు .1993 లో మమత అప్పటికింకా కాంగ్రెస్లోనే ఉన్న కాలంలో, పీవీ ప్రభుత్వంలో క్రీడా శాఖా సహాయ మంత్రిగా ఉన్నప్పటి సంగతి .నదియ జిల్లాలో ఒక మూగ చెవిటి అమ్మాయిని రేప్ చేసారట .బాధితురాలికి న్యాయం జరగలేదు .నిందితుడికి సిపిఎం పార్టీ సప్పోర్ట్ ఉండటమే అందుకు కారణం .[బెంగాల్ లో సిపిఎం కి ఇది నిత్య కృత్యం ].అదే ఆరోపిస్తూ మమత బాధితురాలిని తీసుకుని అప్పటి ముఖ్య మంత్రి జ్యోతి బసు ని కలవడానికి రైటర్స్ బిల్డింగ్ కి[సెక్రటేరిఎట్] వెళ్లారు .జ్యోతి బసు ,అప్పాయింట్ మెంట్ లేదన్న నెపంతో ఆమెను చూడటానికి నిరాకరించారట .అందుకు నిరసన వ్యక్తం చేస్తూ మమత ముఖ్య మంత్రి చాంబర్ ముందే బైటా యించారు .

ఆదేశించే వెళ్ళారో ఆదేసించకుండానే వెళ్ళారో కానీ జ్యోతి బసు మరో తోవ గుండా బయటకి వెళ్లి పోయారట .ఆయన వెళ్లి పోయిన తరువాత లోకల్ పోలీసులు మమతను జుట్టు పట్టుకుని బయటకు నెట్టారు .ఆ సందర్భంలో మమత ప్రతిజ్ఞ చేసారు ....ఇవాళ మీరు నన్ను అవమానించి బయటకు గెంటు తున్నారు... ఒక రోజు నేను తలెత్తుకుని ఇక్కడికొస్తాను అప్పటి వరకూ రైటర్స్ బిల్డింగ్ లో అడుగే పెట్టను అని .అంతే ఈ పద్దెనిమిదేళ్ళు , రాజకీయంగా ఎంత క్రియా శీలంగా ఉన్నప్పటికీ ,ఆవిడ రైటర్స్ బిల్డింగ్లో అడుగు పెట్టనేలేదుట .పద్దెనిమిదేళ్ళ తర్వాత విజయ శంఖాల్ని పూరిస్తున్న అశేష ప్రజానీకపు ఆశల తోవల వెంట నడుచుకుంటూ వచ్చి రైటర్స్ బిల్డింగ్లో కాలు మోపారు .

ఇదంతా వింటుంటే నాకు భారతం గుర్తొచ్చింది .అభిమాన ధనురాలైన ద్రౌపది గుర్తొచ్చింది.రెండు పద్యాలు గుర్తొచ్చాయి .

ద్రోపది బంధురంబైన క్రొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్
దావలచేత బూని ;యసితచ్చవి బొల్చు మహా భుజంగమో
నా విలసిల్ల వ్రేలగా ;మనంబున బొంగు విషాద రోషముల్
గావగ లేక భాష్పములు గ్రమ్మగా ;దిగ్గున లేచి యార్తయై

[ద్రౌపది చిక్కటి తన తల ముడిని విప్పి తాచు పాము వలె వేలాడుతున్న వెంట్రుకల్ని కుడి చేత్తో పట్టుకుని .మనసులో పొంగే విషాద రోషాల్నిఆపుకోలేక ,కంటి నీరు కళ్ళని కమ్మేస్తూ ఉండగా దిగ్గున లేచి ఆర్తయై ..]

నెట్టెన యిట్టి యల్క మది నిల్పితి రక్కెస తాల్మి జిచ్చొడిన్
గట్టినయట్లు పెద్దయును గాలము ;దీనికి నారుటెన్నడున్
బుట్టదు దుష్ట నిగ్రహము పూని జగంబు గాచునట్టి తో
బుట్టువు నీవు ,తేజము న బొల్చిన భర్తలు గల్గ నచ్యుత

[అచ్యుతా గతి లేక ఇంతటి కోపాన్ని రాక్షసమైన ఓర్పుతో నిప్పు ఒడిన కట్టుకున్నట్లు చాలా కాలం నుండి మోస్తున్నాను .దుష్ట శిక్షణ కోసం పుట్టిన నీవు ,పరాక్రమవంతులైన భర్తలు ఉండి కూడా ఇది చల్లారటం లేదే ...]

ఒందల ఏళ్ళు గడిచినా స్త్రీల పట్ల పురుషుల దృక్పధంలో మార్పులేమీ ఉండటం లేదు కదా .ఇదంతా నీచమూ ,అత్యంత హేయమూనూ ...ఆత్మాభిమానం లేకుండా ,స్త్రీ మగ వాడి వెనుక ఉన్నంత కాలమూ అంతా పదిలమే .కాదని నాకు నా స్వంత మెదడుంది, దానికి దాని ఆలోచనలున్నాయంటూ సమత్వాన్ని, దృడ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించామా ఇక అంతే, జుట్టే పట్టుకుంటారో వలువలె ఊడ పీకుతారో ఈ దుశ్శాసనుని అన్నదమ్ములు ...నిరంతరమూ భయమే .
అంత టి ఆత్మాభిమానం కల ద్రౌపది ,అంత కంటే ఎక్కువ ఆత్మాభిమానం కల మమతా బెనర్జీ ఒడిలో కట్టుకున్న నిప్పు లాటి ,ఒక చోట నిలువనీయక నిరంతరం దహించి వేసే అవమానాన్ని ,మృగ క్రౌర్యాన్ని యెట్లా భరించారో. అంతటి రాక్షస ఓర్పు యెట్లా సంపాదించారో కదా ...

ఆనాటి ద్రౌపది అసహాయురాలు. ఆత్మాభిమానిని అయినా ..భర్తల చాటు భార్య ,అచ్యుతుని చాటు చెల్లెలు .అందుకే వారిని వేడుకుంది .విసిగించింది .ఏమయితేనేం పగ సాధించింది .

మమత వెనుక ఏ అండ దండా లేదు ఏక వ్యక్తి సైన్యం .ఆమె నిర్మించుకున్న సామ్రాజ్యం ఆమెదే .పునాది ఆమె దే , పునాది పైని కోటా ఆమెదే ..గెలుపోటముల లెక్క ఆమెదే .మరొకరి ప్రసక్తీ లేదు ప్రమేయమూ లేదు .ఆమె శిరసున అలంకృతమైన విజయ కిరీటం రాయి రాయీ పొదిగి ఆమె స్వయంగా చెక్కుకున్నది .

ఆడ వారు హృదయ వాదులు ., ఉద్రిక్త హృదయులు, ఉద్విగ్నులు.కోపించినా ,దూషించినా ,శపదం చేసినా,ఎ- దు - రు చూసినా నిబద్దతతోనూ హృదయ పూర్వకంగానూ అందంగా చేస్తారు . కదా !

సంతోషం వేస్తుంది .గర్వం వేస్తుంది .ఆశ పుట్టేస్తుంది భవిష్యత్ పైన ఆవిడని చూసుకుని ......లవ్ యు మమతా దీ

Mamata Banerjee's journey from a maverick to a messiah - Assembly Elections 2011: India Today - Photo