మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

16, మే 2011, సోమవారం

షీలా ,నేను,పాపాయి


పాపాయి ,షీలా మంచి స్నేహితులు .ఇద్దరూ ఏమిటేమిటో కబుర్లు చెప్పుకుంటూ వుంటారు .ఆ కబుర్లలో మరీ వింత విషయాలను పాపాయి నా దగ్గరికి పట్టుకోస్తుంది.అందులో ముఖ్యమైనది     షీలా తాగే సిగిరెట్టు.షీలా కి లేని అలవాటు లేనే లేదనీ,అప్పుడప్పుడూ ఇంటికి 
వెళ్తూ వెళ్తూ డ్రైవర్ తో కలిసి మందు తాగి 
వెళ్తుందని కావాలంటే రెడ్ హేన్దేడ్ గా పట్టి ఇస్తామని యేతర  వర్గాలు చెప్పేయి  .అట్లా నిన్న పాపాయి షీలాకి పుట్టిన నాలుగున్నర కేజీల బిడ్డ  గురించి చెప్పింది .అందులో భాగంగా షీలా నాకు తన కాన్పు కథ చెప్పింది.టెర్రర్ పుట్టించిన షీలా కాన్పుల  కథ చెప్పే ముందు పాపాయి యెట్లా పుట్టిందో చెప్తాను .

 నా కానుపు కథ :
 పాపాయి పొట్టలో వున్నప్పుడు నేను ప్రసవ పూర్వ,ప్రసవానంతర జ్ఞానం మీద
 బోల్డు పుస్తకాలు సేకరించి రీసెర్చ్ మొదలెట్టా ఆ సమయంలో అందరూ పడే అనవసరపు హైరానా మీదా ,ఆడంబరపు ఖర్చుల మీదా నాకు తీవ్రమైన వ్యతిరేఖత  వుండేది .మన నాజూకు తనం సరే దేశం లో దేనికీ గతి లేని వాళ్ళు పిల్లల్నేలా కంటున్నారు వాళ్లకి పుట్టటం లేదా పిల్లలూ అని !

అప్పుడు మా ఇంట్లో వుండే బుజ్జమ్మనలుగురు పిలకాయలు ఇంట్లోనే పుట్టారు...ఆమెకు అంత సులభంగా పుట్టగా నాకెందుకు పుట్టరూ ...?మంచి వైద్య సొకర్యం వద్దు అని కాదు.మనకు మాత్రమె  ఎందుకూ అని నా అంతిమ భావన.

అందుకని  నేను బాగా ఆలోచింఛి   పేరెన్నిక గన్న డాక్టర్లని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నా .సడన్ గా నా రెండో నెలలో నేను వెళ్తున్న అతి గొప్ప డాక్టర్ ని వదిలేసి మా ఇంటి దగ్గర ఒక చిన్న కొట్టులో క్లినిక్ నడుపుతున్న డాక్టరమ్మ దగ్గరికి వెళ్ళడం మొదలెట్టా .[అప్పుడు ప్రభుత్వాసుపత్రి గురించి నేను ఊహ చేయలేక పోవడం చేత , ఆ క్లినిక్ మా ఇంటి దగ్గరే వుండటం చేత  నేను ఆ క్లినిక్ కు వెళ్ళేదాన్ని.]  మా ఇంట్లో వాళ్ళు నేనేది చేసినా కాదనగల స్థితిలో వుండరు .ఎందుకంటె నేనంత జ్ఞానురాలనని [నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు ] వారి నమ్మకం.

అట్లా ఆ కొట్టు క్లినిక్ కి నడుచుకుంటా వెళ్లి నడుచుకుంటా వచ్చేదాన్ని .అక్కడ నేను ఇంజెక్షన్ చేయున్చుకుంటే ఆ డిస్పోసబుల్ సిరంజిని దాచే వాళ్ళు 
వేరే పేద పేషంట్ లకి వాడటం కోసం.
ఆ కొట్లోనే పరదా ఎనకాల డెలివరీ చెయ్యమని చెప్పా .అయితే ఆ డాక్టరమ్మ కి  నాకున్నంత  ధైర్యం లేక కాన్పు నేను చెయ్యనూ అన్నది.

మళ్ళీ రీసెర్చ్ ...

డాక్టర్లు ఎలా నిర్దాక్షిణ్యం గా సిజేరియన్ లకి వెలి పోతారో.ఎన్ని కథలు చెప్తారో ఆ రీసెర్చ్ లో  తెలుసుకున్నా.మా ఊరి పూజారి ,భార్య కాన్పుకి పదిహేను వేలు కర్చు పెట్టాడని విని ఆశ్చర్య పడ్డాను .పాపం ఎన్ని చిల్లర నాణాలను పోగుచేసి వుంటే  అంత మొత్తం అవుతుంది.
అందుకని ఇక పట్టు పట్టుకున్నానార్మల్ డెలివరీ కావలసిందే అని.

జూన్ ఇరవై డెలివరీ డేట్ .డిల్లీలో ఫిజిక్స్  పీ హెచ్ డీ చేసి, సైంటిస్ట్ గా వున్న నా స్నేహితురాలు బోధించింది ...నొప్పులు వస్తే  కానీ డాక్టర్ దగ్గరికి ఎళ్ళక .  వెళ్లావంటే సిజేరియనే అని.అందుకని జూన్ ఇరవైని జులై మూడు వరకూ సాగతీశా . ఆ డాక్టరూ ఈ డాక్టరూ అని తిరిగాక ఈవిడ  మంచిదీ అనిపించి ఒకావిడ ని ఎంపిక చేసి పెట్టుకున్నా .తెలిసిన వాళ్ళ చేత బలంగా ''ఆ అమ్మాయికి నార్మల్ డెలివరీ కావాలంట ''అని రికమండ్ చేయించా .

.నా రీసెర్చ్ లో ఇంకో భాగమేమంటే ఇప్పుడు పట్టణ మధ్య తరగతి  వాళ్ళం పనులు అసలు చెయ్యడం లేదు .తినడం మాత్రం పాత తరం వాళ్ళకంటే ఆరోగ్యమైన తిండి తింటున్నాం .దాని వల్ల   కూడా బిడ్డ పొట్టలోనే భరువు పెరిగి పోతుందీ   అని.బిడ్డ బయటకొచ్చి పెరగాలని మా బుజ్జమ్మ చెప్పింది. .అందుకని కడుపుతో వున్నప్పుడు తినబెట్టే సున్నుండ లూ ,నేతి పదార్తాలూ వంటి ఆర్భాట పదార్థాలు  దూరంగా ఉంచా.కానీ నాకు మామిడి పల్లంటే ఘోర ప్రేమ, అందుకని విపరీతంగా మామిడి పళ్ళు తిన్నాను .

అప్పుడు మే  వరకూ రెండున్నర కేజీలు వున్న పాపాయి ,పుట్టేప్పటికి మూడున్నర కేజీలయింది .అందుకని డాక్టరు ఎపిసియాటమి  చేసింది .నేను ఎపిశాటమీనా  అని అడుగుతే డాక్టరు నువ్వు మెడికోవా అమ్మాయ్ అని అడిగింది. 

జులై మూడు రాత్రి తొమ్మిదికి వెళ్లి  నర్సింగ్ హోమ లో చేరా  . జులై నాలుగో తేదీ ఐదూ యాభైకి పాపాయి ఉదయించింది .పాపాయికి నాలాగే బల్బులు లేటుగా వెలుగుతాయేమో,పుట్టేసినా... అమ్మ బోజ్జలోనే వున్నఫీలింగ్లో నే ఉండింది.ఆ ఫీలింగ్ పోడానికి డాక్టరు 
పిర్ర మీద ఒక్కటి అంటిస్తే
 అప్పుడు కుయ్యో మర్రో  మని ,అమ్మోయ్ నన్ను కొట్టేసారమ్మోయ్  అని దాని మొదటి కంప్లైంట్ చేసింది .

డాక్టరు ''నీకు అమ్మాయి పుట్టింది అమ్మాయ్  ''అని చెప్పింది .ఆ విషయం నాకు ముందే తెలుసు అందుకని నేనేం ఆశ్చర్య పడలా .మా పెద్దమ్మోల్లకి చాలా పసువులున్నాయి.నేను పెదమ్మకి ముందే చేప్పా నాకు కొడుకు పుడితే మీ పసులకాడికి యిచ్చే స్తాను  అని .పాపం వాళ్లకి పసులకాడికి ఎవరూ దొరకటం లేదు .ఆ విషయంలో వాళ్ళ అదృష్టం బాలేదని నాకేట్లాగూ తెలుసు . .అందుకని నాకు పాపాయే అని ముందే తెలిసి పోయింది.

అప్పుడిక లెక్కలు వేస్తే పాపాయి పుట్టినప్పటికి కారు పెట్రోలు తో సహా తొలి నెల నుండీ డెలివరీ వరకూ నా కయిన ఖర్చు మూడు వేలా ఇరవై రెండు రూపాయలు.[ఎనిమిదేళ్ళ క్రితం]

ఇప్పుడు షీలా కాన్పు  కథ  :
షీలా బంగ్లా దేశీ.దొంగతనంగా ఇండియాకి వచ్చారు.బంగ్లా దేశ్ లో ఆడవాళ్ళు 
పని చేయడానికి వీలు కాదట .ఇక్కడైతే ఆడా మగాతో సహా అందరం పని చేసుకుని పొట్ట పోసుకోవచ్చు  కదా అని ,సరిహద్దు  దొంగతనంగా దాటి వచ్చేసారు.అప్పటి నుండీ ఇప్పటి వరకూ వాళ్ళ కిక్కడ  
నా అన్న వాళ్ళెవరూ  లేరు .సొంత అన్న ఇరవై ఏళ్ళ తరువాత మొన్న వచ్చి చూసి వెళ్ళాట్ట .

షీలా కి బిడ్డ యెట్లా పుట్టిందీ అంటే, ఒక సారి పని చేసుకుంటూ ఉండిందంట .సడన్ గా బిడ్డ తల బయటకి వచ్చేసిందంట అప్పుడు షీలా తనంతట తాను బిడ్డని బయటకి తీసి పేగు ఎనిమిది అంగుళాలు లెక్క వేసి 
వెదురు బద్దతో కత్తిరించి ముడి వేసిందట .ఎందుకు నువ్వే చేసావ్ అంటే ,ఇక్కడ నాకేవరున్నారు  .ఎవరూ లేరు అన్నది .తను భర్త ఇద్దరూ పనికి పోకపోతే గడిచేదేట్ల అందుకని భర్త రిక్షా తొక్కేందుకు వెళ్లి పోయే వాడట .అయితే నీకెట్లా తెలిసింది పేగు ఎనమిది అంగుళాలు కత్తిరించాలనీ అంటే వాళ్ళూ వీళ్ళూ చెప్పుకుంటూ వుంటే ఎప్పుడో విన్నదట .అంతే కాదు వాళ్ళ పాడా[కాలనీ లేదా స్లం] లో అందరూ ఇళ్ళలో కాన్పులేనట  .ఆ తరువాత మాయ లాటి దేదో వస్తుందట [ఇది నా రీసేర్చ్లో తగల్లేదో ...నాకు అర్థం కాలేదోనాకు దీని గురించి తెలీదు.]దాన్ని తీసికెళ్ళి మట్టిలో పూడ్చి ,వచ్చి బిడ్డకి స్నానం చేయించి అరిటాకు కోసి బిడ్డని అందులో పండబెట్టి పసుపు నీళ్ళు చల్లి ,బిడ్డని ఇంటిలో పెట్టి  తాళం వేసి చెరువుకు వెళ్లి తలారా స్నానం చేసి ,వచ్చి ''పేట్  భొరే  ఖేయే''[కడుపు నిం...డుగా తిని]బిడ్డ పక్కన పడుకుని నిదర పోయిందట .ఎవరినోకరిని సహాయం అడగలేక కాదు .ఏం నేను చేసుకోలేనా అని ఒక తప్పనిసరి  ధైర్యం షీలాది .

తనకు పుట్టిన ఐదుగురి పిల్లలకీ అలాగే చేసుకుందట .వింటూ వుంటే ఆ భయానక భీబత్స  దృశ్యం కళ్ళ ముందుకొచ్చి ఒకటే దిగులేసిపోయింది.ఒక చెంపన కార్పోరేట్ హాస్పిటళ్ళు ...అతి నాజూకులూ ,ఒక చెంపన ఇళ్ళలో జరిగే అనారోగ్యకర కాన్పులూ ...జంతువులలాగే బ్రతికేస్తున్న మనుషులూ 

అట్లా ఎందుకు ఉండాలనిపిస్తుంది.మనుషులమేం  చెడ్డ వాళ్ళం  కాదు.,ఒక కథో,సినిమానో చూసి కళ్ళ నీళ్ళు పెట్టేసుకునే మనం చెడ్డ  వాళ్ళం ఎందుకవుతాం?కానే కాం .మన సహృదయ సహజాతాన్ని మేల్కొలిపే ఒక ప్రేరణ ఏదో  ఇవాళ మనకు కావాలి .అవును కదా !.అందరం మెరిసిపోయే గచ్చు వున్న హాస్పిటల్ల లోనే మన బిడ్డలకి జన్మ నివ్వాలి .మనమెవరం గంటలు గంటలు నిలబడి జనరల్ కంపార్ట్ మెంట్లలో ఆశుబ్రత మధ్య ప్రయాణించ కూడదు.సౌకర్యమైన చల్లటి భోగీలలోనే ప్రయాణించాలి .అందుకోసం మనం కాదు మన ప్రభుత్వం  ప్రయత్నించాలి ,కదా? .కానీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదు ?.

డబ్బు వున్న వాడు తిరుమల లో వీ ఐపీ దర్శనమో మరేదో చేసేసుకుంటాడు కదా ,లేని వాడు ఆ కొట్టుల్లో గంటలు గంటలు నిరీక్షిస్తాడు.అట్లా ఎందుకు ?అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆ భగవంతుడనే  వాడిని చూడ బుద్దే కాదు .జ్ఞానులైన  వారి దృష్టిలో కుక్క ,కుక్క మాంసం  తినే వాడూ అందరూ ఒకటేనట .కృష్ణ పరమాత్ముడు చెప్పేడు. అయినప్పుడు ఇలా ఎందుకూ మరి?ఎక్కడో ఏదో లోపం అనిపించడం లేదా ?పక్క మనిషి  బాధ పడాలి ,మనం మాత్రమె సుఖం గా వుండాలి అని మనం ఎందుకు అనుకుంటాం ?అస్సలు అనుకోం కదా ?లోపం మనలో లేనే లేదు.ప్రభుత్వాలది.అవునా కాదా?కాకపోతే తిరిగి  తిరిగీ లోపం మనదే .నాకట్లా అనిపించింది మరి.

షీలా కథ విన్నాక నాకు మూడ్ మొత్తం పాడయింది.సమస్త దురన్యాయాలు గుర్తొచ్చి ,ఏవేవో ప్రశ్నలు మెదడుని తింటూ వుంటే పనిమాలా 
నా పెళ్లి రోజు ముసుగు పెట్టి పడుకున్నా.

కామెంట్‌లు లేవు: