మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

30, ఏప్రిల్ 2011, శనివారం

పెళ్ళి కబుర్లు !

నా మేన మామ కొడుకు పెళ్ళికి వెళ్ళాం .చెట్టు కొమ్మలన్నీ ఒకే సైజులో ఉండనట్టు మన బంధువులు కూడా స్థితిగతుల్లో అందరూ ఒకేలా ఉండరు కదా .కొందరేమో పెద్ద పెద్ద చదువులు చదివేసి అమెరికాలూ,ఆఫ్రికాలూ తిరుగుతూ ,మరి కొందరేమో మంచి మంచి పదవుల్లో ఉంటూ ఉంటే కొందరు, అతి నవతరం వారు చదువుల బకెట్ తన్నేసి వ్యవసాయం చేపడుతున్నారు .అత్యాదునికమూ ,ఆధునికమూ, పాతదనమూ కలగలిపిన భారత దేశపు సిసలైన చిత్ర పటం ఇది .

పెళ్ళికొడుకు కార్పోరేట్ కాలేజ్ లో చదివినా ఇంటర్ గట్టేక్క లేక పోయాడు .అందు నిమిత్తం వాడే కాదు వాళ్ళ నాన్న కూడా చింత పడ్డ దాఖలాలు లేవు . వయసు పాతికేళ్ళు కూడా దాట లేదు .వాడికి ఇరవై పెట్టినప్పటి నుండి సంబంధాలు చూట్టం మొదలెట్టారు .ఇప్పుడు అమ్మాయిలకి కరువొచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు ,నిజమెంతో కానీ అంచేత వాడికి ఇట్లా లేటు వయసులో పెళ్ళి చెసుకోవాల్సి న అగత్యం పట్టింది .

అమ్మాయి పదహారేళ్ళ పిల్ల . బాగా పొడవుందని మా మామతో అంటే ఇంకా కూడా ఎదగద్ది నాయనా మొన్నే పదిహేడు పెట్టింది అన్నాడు .మరీ అంత చిన్న పిల్ల ...అసహ్యంగా ఎందుకట్లా అని మా పెదమ్మ తో అంటే ఇచ్చినోల్లకి లేని అసయ్యం మనకేందుకో ...అంది .పిల్ల పదో తరగతి కూడా పూర్తి చేయలా .

మన పెళ్ళి వేడుక బాగానే ఉంటుంది కానీ సంపదని అట్లా నిర్లజ్జగా ప్రదర్శించే తీరు నాకు బాధ కలిగిస్తుంది .ఉన్న వాళ్ళ మెడలో చేతులో పచ్చగా మెరుస్తుంటే లేని వాళ్ళ ముఖాలు నల్ల బడటం ఎంత అమానవీయం .నా కూతురి పెళ్ళి కార్డులో అచ్చోత్తించాలి నగలు వేసుకోడం నిషిద్దం అని .

పిల్లోడితో కలిసి పెళ్ళి కూతురింటికి వెళ్ళాం .పచ్చటి కొబ్బరాకుల పందిరి కింద అందరూ కూర్చుని కబుర్లు మొదలెట్టారు .మా వదిన నేను మాట్లాడుకుంటూ ఉంటే మా పెదమ్మ అంది మీ వదినకి పొగులు పోద్దస్తం మాటలు కావాలి అని .మా పెదమ్మ కొడుకు చేసుకుంది మా మేన మామ కూతుర్నే ..అందుకనే అత్త, కోడలిపై అలా జోకులు వేయగలిగిందన్న మాట .

మా వదిన ....మీ అన్న అసలు ఒక్క మాటా మాట్లాడడు,ఏమన్నా అన్నామంటే చేలల్లో ఏం సంగతు లుంటాయి నీకు చెప్పేందుకు అంటాడు .సంతాప సభ పెట్టినట్టు ఎంత సేపు మౌనంగా ఉండగలం చెప్పు అంది . ఇది చాలా పెద్ద సమస్య .నాకో స్నేహితురాలు ఉండేది భర్త s p డ్యూటీ నుండి ఇంటికి రాగానే టీవీ చూస్తూ కూర్చున్టాట్ట.అతనూ ఇదే సమాధానం ఏముంటాయ్ మాట్లేడేందుకు ..అని .ఏమీ ఉండవా ..లేక మాట్లాడేందుకు ఇష్టం లేదా .కనీసం భార్య కంప్లైంట్ ని గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అయినా ఉండదా ?ఏం లేదు పడి ఉంటార్లే అని ధీమా అంతే .ఆ తరువాత ఆ పిల్ల అతనిలా వెహికల్ దిగటం తనలా వెహికల్ ఎక్కటం అనే పద్ధతి కని పెట్టింది .అప్పుడు వాళ్ళే మనకోసం ఎదురు చూస్తారు అని చెప్పి చక్కని నవ్వోటి నవ్వింది .

బహుసా ఈ భర్తలకి భార్యలతో భావ సారూప్యత ఉండదు కాబోలు , అది పెళ్ళికి ముందే ఆలోచించాలి కదా .మా వదిన ఇంకా చాలా విషయాలు మాట్లాడింది.95 %మగ వాళ్ళు నీట్ గా లేరని చెప్పింది .మంచి పుస్తకాలేమైన చదవగూడద అంటే సాయి బాబా పుస్తకాలు చదువుతున్నానని చెప్పింది.ఇతరేతర పుస్తకాలైతే లేని పొని ఆలోచనలు వస్తాయనీ ఇవయితే అన్ని ఆలోచనలని అణచి వేస్తాయని దిమ్మ తిరిగే స్త్రీ వాదం మాట్లాడింది .అట్లా నేను పడీ లేచి చదివి సంపాదించిన స్త్రీ వాద జ్ఞానాన్ని మా వదిన మొగుడు పుణ్యమా అని అనుభవం తో సంపాదించేసింది .

మా అన్న టెన్త్ క్లాస్ ఫెయిలయ్యాడు .అప్పుడు ,మా పెద నాయన కొంచెం చదివించమని మా ఇంటికి పంపాడు .పుస్తకం ముందు పెట్టుకొని మా అన్న మా కర్రావు ఈనిందో లేదో అనే వాడు .ఈ వూర్లో ముసురు పడ్తే ఆ ఊర్లో కోతలు కోసారో లేదో అని బాధ పడేవాడు .అట్లా చదివి తప్పిన లెక్కలు గట్టెక్కి చదువు చాలించి పెద్ద రైతయ్యాడు.ఇప్పుడు ఆయనకి బోలెడు ఆసక్తి ఇద్దరు కూతుర్లని బాగా చదివించాలని .

గోరటి వెంకన్న ''నారాయణ కోచింగుకు రాములయ్య నువ్వు వొడిపించుకున్నదెంత రాములయ్య ''అని అన్నట్టు పెద్ద కూతురి మెడిసన్ చదువుకి నారాయణ్ మెడికల్ కాలేజీకి లక్షల డొనేషన్ కట్టేశాడు .పీజీ సీటు ప్రస్తుతం ఎనబై లక్షలు పలుకుతుందని సమాచారం సేకరించుకుని పెట్టాడు . రెండో కూతుర్ని కలక్టర్ ని చేయాలని కంకణం కట్టుకున్నాడు .ఎంతుంటే ఏం లాభం ఎక్కడికన్నా పొయ్యి ఒక మాట మాట్లాడ గలిస్తిమా అని ఆయన ఫీలింగ్ .

అమెరికాలో ఉద్యోగం చేస్తున్నకూతురు ,అల్లుడూ ఉన్న మా అత్త ఆరో నెలలోనే ఎమ్బటి తెచ్చిన రెండేళ్ళ అమెరికా మనవరాలిని పెళ్ళికి తీసుకొచ్చింది.వెండి రేటు తగ్గిందని రెండు మూడు కేజీలన్నాకొని పారేయమని నాకు సలహా ఇచ్చింది .ఇంకో బంధువు వాళ్ళ కొడుకు ఫాబ్రికేషన్ ఇండస్ట్రీ పెట్టాడనీ నన్ను కూడా అటువంటిదేమైనా పెట్టి పారేయమనీ అన్నాడు .ఈ తరహా కోస్తా ఆంధ్రా సలహాలంటే తెలంగాణా వాడైన నా భర్తకి మంట .నువ్వు స్వతహాగా మంచి దానివి వీళ్ళ దగ్గర ఎక్కువ రోజులుంటే పాడై పోతావ్ మనం త్వరగా వెళ్లి పోదాం అని జోకులు మొదలెట్టాడు .

చక్కగా గాడి పొయ్యిలు పెట్టి వండి కొసరి కొసరి వడ్డించారు .ఈ తరహా ఆప్యా యపు పెళ్ళి భోజనం చేసి చాల రోజులయింది .నేను జీవ కారుణ్యత దృష్ట్యా ఏడెనిమిదేళ్ళ వయసులో మాంసాహారం మానివేసానా ..నాతో కూర్చున్న మిగిలిన ఆడ వాళ్ళందరూ శాఖా హారులే కాటం నన్ను ఆశ్చర్య పరచింది .ఒక సారి నా రీసెర్చ్ గైడు [పుట్టుకతో శాఖాహారీ ఆ పై జ్ఞానంతో మంసాహారీ గా మారిన వాడు ]ఇప్పుడు తినని వాళ్ళు తింటున్నారు తినే వాళ్ళు తినడం లేదు అని అన్న మాటలు గుర్తొచ్చాయి .

నా పక్కనే కూర్చున్నావిడని అడిగా ఎందుకని మీరు నాన్ వెజ్ తినటం లేదని ..ఆవిడందీ చిన్నప్పుడు చేప తిని బడి కెళ్లా, గొంతులో ముళ్ళు ఇరుక్కుని ఇబ్బంది గా అనిపిస్తుండింది .అది చూసి మా ఐవారు వాట్ని చంపి తింటే గుచ్చుకోవా ముళ్ళు అన్నాడు ,అది సరి మల్లెప్పుడూ తిన్లా అని. ఆవిడకి ఇప్పుడు అరవై అయిదేళ్ళు దాకా ఉంటాయ్ .పాపం ఆ పాపి ఐవారు ఎవరో !

భోజనాలు చేసి పెళ్ళి కొడుకు దగ్గర మా పెదమ్మని ఉంచి అందరం బయల్దేరాం.వెళ్లి పోతున్న మమ్మల్ని చూస్తూ నిల్చున్న పెళ్ళి కొడుకు దగ్గరికెళ్ళి అన్నాను ...ఒరేయ్! పాపం నిన్నోక్కడినే వదిలేసి వెళ్తున్నాం .ఒక వేళ ఇక్కడే ఇట్లా ఉంది పోవాల్సి వస్తే ఎలా ఉంటున్దోరేయ్ అంటే ...వాడు అబ్బ ఎట్టుంటాం ..అక్కా ! మనూరు కాకుండా , మనోళ్ళు లేకుండా ఉండలేం అన్నాడు .నేనన్నాను రేపు నీ భార్యకి కూడా అలాగే అనిపిస్తుంది ఎలా చూసుకుంటావో మరి అని .ఆ మాటతో ఆడ వాళ్ళందరూ ...మగ పెళ్ళి వారా ,ఆడ పెళ్ళి వారా అనే భేదం లేకుండా ఒక్క సారిగా హా ...హా కారాలు చేసారు .

కామెంట్‌లు లేవు: