మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

14, మే 2011, శనివారం

బొటనేలంత రెడ్డి కథ !


అమ్మలు కథలు చెప్తారా ?చెప్తే అమ్మలు చెప్తారు ?నాకు తెలిసినంత వరకూ చాలా మంది అమ్మలు కథలు చెప్పరు.కథలు చెప్పేంత తీరిక ,సాదా అమ్మలకు ఉండదు .పట్టణీకరణ చెందిన ,నగరీకరణ చెందిన ,అలా చెందిన వారిలోనూ ,తీరిక ఉన్న అమ్మలు కథలు చెప్తారు .

ఇంట్లో పెద్ద వాళ్ళెవరూ లేని ...కవి ,ఉద్యమ కారుడూ , ఉపన్యాసకుడూ ఐన నా స్నేహితుడి మూడేళ్ళ కూతురికి నేను కొన్ని కథల పుస్తకాలు బహుకరించాను .తను వాట్లిని చాలా ఎంజాయ్ చేసిందనీ , చెప్పమని వేదిస్తుందనీ ఫీడ్ బాక్ ఇచ్చినపుడు , చాలా సంతోషించి మరో సారి కలిసినపుడు మరి కొన్ని పుస్తకాలు ఇచ్చాను . సారి పుస్తకాలు చూడగానే పాప బోలెడు సంతోష పడగా ,అమ్మ ,నాన్న చాలా అసహనం వ్యక్తం చేసారు .కథలు చెప్పందే వదలటం లేదనీ ,తమకేమో తీరిక లేదనీ ,[ కొత్త పుస్తకాల బాధను ఎలా డీల్ చేయాలనేది ] వారి ఆరోపణ .

మాకు మా అమ్మ కథలు చెప్పలేదు .కొత్త కోడలిగా ఇంట అడుగు పెట్టిన మా మేన మామ భార్య కథలు చెప్పింది . మా సావాసగాడు జైపాలోళ్ళ నాయన కథలు చెప్పాడు .మా నాయనకు చిన్నప్పుడు, అప్పటికింకా పెళ్ళి కాని వాళ్ళ మేనత్త కథలు చెప్పింది .మా అమ్మోళ్ళకి వాళ్ళ పసులకాడి సుబ్బ రాయుడు కథలు చెప్పాడు .గోపిని కరుణాకర్ కు వాళ్ళ గుడ్డవ్వ కథలు చెప్పింది .ఖదీర్ బాబుకూ అంతే .నా కూతురికి వాళ్ళ అమ్మమ్మ కథలు చెప్తుంది .తాత కథలు చెప్తాడు .పని పాటల ప్రధాన స్రవంతిలో లేని వారు మాత్రమే సాధారణంగా కథలు చెప్పడం జరుగుతూ వస్తుందని నా చిన్ని పరిశీలన . .

మా అమ్మాయికి కథ చెప్పాల్సి వస్తే మా అమ్మ దగ్గర సిద్దంగా ఉండేవి మూడు కథలు .1 .బొటనేలంత రెడ్డి కథ 2 .కొంగ బావ - నక్క బావ కథ 3 .పేను బావ కథ .[కథలకి చివర ఈ బావ అనే పదం ఎందుకు వాడుతారో కొంత తెలుసుకోవాల్సి ఉంది .]
బొటనేలంత రెడ్డి కథ !
అనగనగా ఒక ఊళ్ళో బొటనేలంత రెడ్డి ఉండే వాడట . బొటనేలంత రెడ్డికి చేటడంత కయ్యి , ఈగంత పెళ్ళాం ,దోమంత కూతురు ఉండే వాళ్లంట. చేటంత కయ్యిలో సెవా శేరు ఒడ్లు పండేవంట. వాటితో వాళ్ళు సుఖంగా బతికే వోల్లన్ . అయితే ఒక సారి ఏమయ్యిందీ.. చేటంత కయ్యి మీదికి వామన్దాడిగా పిచుకులు వొచ్చినాయంట . వొచ్చి గింజ మిగలకుండా తినేయడం మొదలు పెట్టేయి .అది చూసి గట్టు మీద కూర్చుని బొట్నేలంత రెడ్డి ఒకటే ఏడుపు ...

అంతలోకి దార్లోనే ఒక గాజుల శెట్టి పోతా... ఉన్నేడం. పోతా పోతా యాడస్తా ఉండ్న రెడ్డిని జూసి ,బొట్నేలంత రెడ్డా! బొట్నేలంత రెడ్డా ! ఎందుకట్టా యాడస్తా ఉండావు అని అడిగినాడు .అప్పుడు బొట్నేలంత రెడ్డి ..ఏం చెయమంటావు గాజుల సెట్టా ! నాకుండేది చేటడంత కయ్యి , దాంట్లో పండే శివు శేరు వోడ్లె కదా మాకు ఆదరవా ! పిచుకలు మడసానా తిని పారనూకతా ఉంటే మేమెట్టా బతకాల .అది తలుసుకునే యాడస్తా ఉండా అన్నాడు .అప్పుడు గాజుల శెట్టి ,అయితే ఒక పని చెయ్ రెడ్డా నేనొక మాట జెప్తా ...రేప్పోద్దన్నే వచ్చి పిచుకల నన్నిట్ని వాలనిచ్చి '' పిచుకలకి నాకు టుంగు బుర్ర'' అను ,పిచుకలన్నీ సచ్చి పడిపోతాయి అపట హాయిగా బతుకు అని చెప్పి సక్కా బొయినాన్టమ్మ .

అప్పుడే
మయిన్దీ.. పక్కన రోజు , పొద్దు బొడవకతలికే బొట్నేలంత రెడ్డి చేలోకొచ్చి పిచుకలనన్నిటినీ వాలనిచ్చి, పిచుకలకి నాకూ టుంగు బుర్ర అనేస్నాడంట .అంతే పిచుకలన్నీ సచ్చి పడ్డాయి .సచ్చి పడ్డ పిచుకలనన్నిటినీ మూట గట్టుకొని ఇంటికొచ్చి ,పెళ్ళాన్ని పిల్చి ..వొసేయ్ ! వొసేయ్ ! నేను నీళ్ళు బోసుకొచ్చేతలికి పిచుకలతో కూరొండి పెట్టు అని చెప్పి నీళ్ళు బోసుకోవడానికి సక్కా బొయినాడం .

అప్పుడేమయిందీ
.... ఈగంత పెళ్ళాం అటిక పొయ్ మీద పెట్టి , మసాలా గిసాలా నూరి పిచుకల కూర ఒండిన్దంట..., ఒండే పిచుకుల కూరని కుత కుత లాడే టప్పుడు ,ఉడికిందా లేదా అని ఒక పిచుకని ,బలే ఉందే అని ఒక పిచుకని ,ఉప్పు మడసంగా ఉందా లేదా అని ఒక పిచుకని ఇట్టా ఒక్కొక్క పిచుకనీ తిని పార నూకిన్దంట .అమా అమా ఏంది మా ! వాసన బలే ఘమాయించి కొడతా ఉందే ...అంటా వచ్చిన కూతురికి రొవన్ని పిచుకులు పెట్టిందంట. పెకారంగా బొటనేలంత రెడ్డి వొచ్చేతలికి తల్లీ కూతుళ్ళు అటిక మొత్తం నాకి పారనూకినారంట .

బొట్నేలంత
రెడ్డి ఒచ్చి పీట వాల్చుకొని , అమేయ్ అన్నం బెట్టు అన్నాడంట .ఈగంత పెళ్ళామ్ అన్నం పెట్టింది కానీ యెయ్ డానికి కూరేడుందే ..మొత్తం అయ్యే పాయ .అదే సంగతి పెనిమిటికి జెప్పింది .అప్పుడు జూసుకో నా సామి రంగా బొట్నేలంత రెడ్డికి సుర్రుమని కోపం వొచ్చేసి ''నా పెళ్ళానికి నాకు టుంగు బుర్ర ''అని పార నూకినాడం .ఇదంతా జూసిన కూతురు ఏంది నాయనా పనా అన్న దానికి నా కూతురికీ నాకూ టుంగు బుర్ర అనేసినాడం. కూతురూ సచ్చి పాయ .
అంతే తుండు గుడ్డ పైనేసుకుని పోతా ఉన్నే డంట .దార్లో ఒక దేవళం దగ్గిర బాపనోళ్ళ సంతర్పణ రగతా ఉన్నిన్దంట.ఆడికి బొయ్యి వరసలో కూర్చున్నాడం . వొ డ్డించే వోళ్ళు నలుసంత నలుసంత ఇదలస్తా ఉన్నేరంట .మారు పెట్టమన్నా రకంగానే చేస్తా ఉండేతలికి కోపమోచ్చేసి బొట్నేలంత రెడ్డి ,ఈ బాపనోల్లకీ నాకూ టుంగు బుర్ర అన్నాడంట అంతే అందరూ సచ్చి పోయినారంట .గంగాళాల్లో , దబరలలో ఉండేదంతా కడుపు నిండా తిన్నా డంట .అంతే పొట్ట పెరిగి పెరిగి బానంత అయి పోయిందంట .పొట్ట పెరిగిందని తలుపు పెరగద్దా .బయటకి పోదామంటే పొట్ట అడ్డం పడతా ఉండే . ఆకరాకి విసిగి పోయి బొట్నేలంత రెడ్డి నా పొట్టకీ నాకూ టుంగు బుర్ర అన్నాడంట .అంతే ఇంకేముందే ...పొట్ట డామ్మని పగిలి సచ్చి పోయినాడం . కథ కంచికి మనం ఇంటికీ .........

గూగుల్ లిప్యంతరీకరణ సహకరించక పోవడం వల్ల మా ఊరి మాండలికాన్ని చెప్పాల్సినంత బాగా చెప్పలేక పోయాను .[మా ఊరు ఏదో చెప్పాల్సిన పని లేదు కదా !]

కామెంట్‌లు లేవు: