మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

11, జులై 2011, సోమవారం

గోసానిమారి .


మేముంటున్న కూచ్ బీహార్ కి దాదాపు నలభై నిమిషాల దూరంలో ఉంది ఈ గోసాని మారి .భూస్థాపితం ఐన ఒక రాజ కోట ఉంది ఇక్కడ .అది భూస్థాపితం ఎందుకయిందంటే ...అంటూ ఇక్కడి వాళ్ళు ఒక కథ చెప్పారు .

కామతేస్వర్ అనే రాజు ఈ రాజ్యాన్ని పాలించాట్ట . .రాజు గారు మొదట పశువుల కాపరి అట .ఊరందరి పశువుల్ని పచ్చిక బీళ్లలోకి తోలుకెళ్ళి, వాటి పలుపులన్ని ఊడ దీసి ,, పలుపులన్నిటినీ కలిపి తల కింద పెట్టుకుని నిద్ర పొయ్యే వాడట .ఆ పశువులు ఊరందరి పొలాలలో పడి మేసేవట.ప్రజలందరూ రాజు గారికి ఫిర్యాదు చేసారట .అప్పుడు రాజు గారికి కోపమొచ్చి స్వయంగా విచారించేందుకు వచ్చాట్ట ,రాజు గారు వచ్చేటప్పటికి నిద్ర పోతున్న ఈ కామతేస్వరునికి ఒక పాము పడగ విప్పి నీడ పట్టి ఉందట .అది చూసి రాజు వెనుదిరిగి వెళ్లి పోయాడట .

ఇలా జరుగుతూ ఉండగా ఈ కామతేస్వరునకి ఒక కల వచ్చిందట .కలలో దేవత చెప్పిందటా .......నేను నీ దగ్గరికి మూడు జంతువులను పంపుతాను వాటిలో నువ్వు దేనిని పట్టుకుంటావో దానిని బట్టి నీ అదృష్టం ఉంటుంది అని .మొదట పులి వచ్చిందట ,ఆ పై ఏనుగు వచ్చిందట ,రెంటినీ కామతేస్వరుడు పట్టుకోలేక పోయాడట చివరిలో పాము వచ్చిందట .పాముని కూడా వెళ్లి పోతూ ఉండగా తోక పట్టుకున్నాట్ట .అప్పుడు దేవత అన్నదట ,నువ్వు రాజువవుతావ్ ,కానీ నీ తర్వాత నీ రాజ్యం అంతరించి పోతుంది అని .

అట్లా కామతేస్వరుడు రాజయ్యాడు .చాలా యుద్దాలలో గెలిచాడు .అతనికి ఓ వరముండేదట ,ఏమనీ ....అతని ఎదుట నిలబడి ఎవరూ అతన్ని జయించలేరు .వెనక నుండి దాడి చేస్తేనే ఓడించ గలరు .అతనికి ఏడుగురు భార్యలు .ఏడో భార్యకి ఈ రహస్యాన్ని చెప్పాట్ట .ఆవిడ ఏం చేసిందీ ఒక యుద్ద సందర్భంలో ఈ రహస్యాన్ని శత్రువులకి చెప్పేసిందట .మరి చెప్పరేమిటి,,, అన్నేసి భార్యలుంటే .. ఎవరికేవరేంటి ...ఎవరికీ ఇతను నా సొంతం అనే ఫీలింగ్ ఉండదు కదా .

అట్లా శత్రువు వెనక మల్లుగా వచ్చి రాజా వార్ని పొడిసేసాడు.అప్పుదేమయ్యిండీ రాజా వారు శత్రువులతో అన్నారూ ,,నేను నా మందిరంలోని ఇష్ట దేవత కి నమస్కారం చేసుకుని వస్తాను అప్పుడు మీరు నన్నేమైనా చెయ్యొచ్చూ అని .శత్రువులు ఒప్పుకున్నారు .రాజా వారు వెళ్లి నమస్కరించారా ...ఇంకేముందీ రాజ మహల్ మొత్తం దానంతటదే తిరగబడి ఏడవ రాణితో సహా భూ స్థాపితం అయిపోయిందట .

అర్ఖియాలజీ వాళ్ళు తవ్వుతుంటేనట బోలెడు అపశకునాలు జరిగాయట అంచేత అసంపూర్ణంగా వదిలేశారట .ఇదీ కథ
ఇక్కడో మందిరం ఉండి .కామతేస్వరుడే నిర్మించాడనీ,ఒకటే రోజులో నిర్మాణం పూర్తయిందనీ వీళ్ళు చెప్పారు .


బయల్పడ్డ గోడ .
రాజుల్ పోయే... రాజ్యాల్ పోయే ...
తిరగబడ్డ కోట శిఖరం

మ్యూసియం
ఇది సగం తవ్వి అపశకునాలకి భయపడి దిలేసిన ప్రాంతం
అచట పూసిన పూలు

మందిరం అరుగు మీద ఉన్న వృద్దుడు .దేవుడు ఈ రూపం లో కూడా చరించ వచ్చేమో కదా

విష్ణు మూర్తి ..ఎంత బాగుంది కదా ..అలంకరణ

కామినీ పూలు ...ఎటులైనా ఇచటనే ఆగిపోనా ....అనిపించేసింది ఆ పరిమళానికి


మందిర ముఖ ద్వారం



లోపలికి అడుగు వేయగానే కనిపించారు వీరు ...

నాలుగు మూలలా ఇలా నాలుగు మందిరాలుంటాయి

2 కామెంట్‌లు:

తృష్ణ చెప్పారు...

నాల్రోజుల్లో ఎన్ని రాసేసారో..:) తీరుబడిగా చదువుతా. ఇలా కోటలూ, వాటి కథలు అవి అంటే నాకు భలే ఇష్టం అండి. ఫోటోలు చాలాబాగున్నాయి.

గోదారి సుధీర చెప్పారు...

అయితే నేనిక వెతకాలి ,బెంగాల్ లో ఏమేం కోటలు ఉన్నాయీ అని ..thank you.